FABC ప్లీనరీ సమావేశంలో తొలిసారిగా ఎలక్ట్రానిక్ ఓటింగ్తో కీలక కమిటీల ఎన్నిక
Federation of Asian Bishops' Conferences (FABC) 12వ ప్లీనరీ సమావేశం తొలి రోజున చారిత్రక ఘట్టం చోటుచేసుకుంది. సమావేశ నిర్వహణకు నాయకత్వం వహించే అధికారులను, అలాగే సమావేశంలోని రెండు ప్రధాన పత్రాలను సిద్ధం చేసే కమిటీలను ఎన్నుకోవడానికి ప్రతినిధులు తొలిసారిగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానాన్ని వినియోగించారు.
జూలై 21న జకార్తాలోని హోటల్ ములియాలో జరిగిన ఎన్నికల్లో, తుది పత్ర కమిటీ, తుది సందేశ కమిటీ, అలాగే సమావేశ అధ్యక్ష మండలి (Presiding Officers) సభ్యులను ఆన్లైన్ ఓటింగ్ వేదిక ద్వారా ఎన్నుకున్నారు. FABC ప్లీనరీ సమావేశ చరిత్రలో ఈ విధానం తొలిసారిగా అమలైంది.
ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ వ్యవస్థను సమావేశ మీడియా బృందం, ఇండోనేషియా పీఠాధిపతుల సమాఖ్య (KWI) కమ్యూనికేషన్స్ కార్యాలయం, Radio Veritas Asia (RVA) Media సహకారంతో రూపొందించి నిర్వహించింది.
ఓటింగ్ను Google Forms ద్వారా నిర్వహించారు. పీఠాధిపతులు తమ మొబైల్ ఫోన్ల ద్వారా ఓటు నమోదు చేశారు. ఓటింగ్ ప్రారంభానికి ముందు ప్రధాన తెరపై ప్రదర్శించిన QR కోడ్ ను స్కాన్ చేసి ప్రతినిధులు ఎలక్ట్రానిక్గా నమోదు చేసుకున్నారు. వ్యవస్థను వినియోగించడంలో లేదా నమోదు ప్రక్రియను పూర్తి చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొన్న పీఠాధిపతులకు కమ్యూనికేషన్స్ బృందానికి చెందిన వాలంటీర్లు సహాయం అందించారు.
FABC ఉపాధ్యక్షుడు కార్డినల్ పాబ్లో వర్జిలియో ఎస్. డేవిడ్ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. ప్రతి విడత ఓటింగ్కు ముందు ఎన్నిక జరుగుతున్న కమిటీ గురించి వివరించి, ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులెవరో, ఓటు హక్కు కలిగిన సభ్యులెవరో తెలియజేశారు. ప్రతి ఎలక్ట్రానిక్ ఓటింగ్ ముగిసిన వెంటనే ఫలితాలను ప్రకటించారు.
మొత్తం ఎన్నికల ప్రక్రియ సుమారు 30 నిమిషాల్లోనే పూర్తయింది. డిజిటల్ విధానం ఎంత సమర్థవంతంగా పనిచేసిందో ఇది స్పష్టంగా చూపించిందని నిర్వాహకులు పేర్కొన్నారు. సంప్రదాయ కాగితపు బ్యాలెట్ విధానం లేదా చేతులు ఎత్తి ఓటింగ్ నిర్వహించి ఉంటే దీనికంటే ఎంతో ఎక్కువ సమయం పట్టేదని వారు అభిప్రాయపడ్డారు.
అయితే, ఓటింగ్ ప్రారంభానికి ముందు సమావేశంలో ఒక విధానపరమైన అంశం చర్చకు వచ్చింది.
ఫిలిప్పీన్స్లోని కాసెరెస్ అగ్రపీఠాధిపతి రెక్స్ ఆండ్రూ క్లెమెంట్ అలార్కాన్, FABC నియమావళి ప్రకారం ఓటింగ్ కాగితపు బ్యాలెట్ ద్వారా లేదా చేతులు ఎత్తి నిర్వహించవచ్చని మాత్రమే పేర్కొనబడిందని, ఎలక్ట్రానిక్ ఓటింగ్ గురించి స్పష్టమైన ప్రస్తావన లేదని గుర్తుచేశారు. అందువల్ల ఆన్లైన్ ఓటింగ్ విధానాన్ని అమలు చేయడానికి ముందు సమావేశ సభ్యుల ఆమోదం అవసరమని ఆయన సూచించారు.
కార్డినల్ డేవిడ్ ఈ సూచనను సమావేశం ముందుంచిన అధికారిక తీర్మానంగా స్వీకరించారు. మరొక సభ్యుడు ఆ తీర్మానానికి మద్దతు తెలపగా, ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం కాకపోవడంతో సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ వినియోగానికి ఆమోదం తెలిపారు. దీంతో ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది.
అంతకుముందు FABC అసోసియేట్ ప్రధాన కార్యదర్శి గురుశ్రీ క్లారెన్స్ దేవదాస్, ఎన్నికైన మూడు బృందాల బాధ్యతలను వివరించారు. ఈ ప్లీనరీ సమావేశం రెండు ప్రధాన పత్రాలను రూపొందించనుందని ఆయన తెలిపారు. అవి ఆసియాలో సినడాలిటీపై ఆచరణాత్మక మార్గదర్శకం (Vademecum on Synodality in Asia) మరియు FABC 12వ ప్లీనరీ సమావేశ తుది సందేశం.
తుది పత్ర కమిటీ, ప్లీనరీ సమావేశ ప్రసంగాలు, చిన్న బృందాల నివేదికలు, అలాగే పాల్గొనేవారి సూచనల ఆధారంగా ఆచరణాత్మక మార్గదర్శకం (Vademecum) రూపురేఖలను సిద్ధం చేయనుంది. పీఠాధిపతుల సినడ్ తుది పత్రం మరియు FABC బ్యాంకాక్ పత్రం వెలుగులో ఆసియా అంతటా సినడాలిటీని అమలు చేయడానికి ఇది పీఠాధిపతులకు ఒక ఆచరణాత్మక మార్గదర్శకంగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
ఈ కమిటీకి టోక్యో అగ్రపీఠాధిపతి, FABC ప్రధాన కార్యదర్శి కార్డినల్ టార్సిసియో ఇసావో కికూచి, SVD, గోవా మరియు డమన్ అగ్రపీఠాధిపతి, FABC అధ్యక్షుడు కార్డినల్ ఫిలిపే నేరి ఫెర్రావో, కలూకాన్ పీఠాధిపతి, FABC ఉపాధ్యక్షుడు కార్డినల్ పాబ్లో వర్జిలియో ఎస్. డేవిడ్, అలాగే కిర్గిజ్స్తాన్ అపోస్తలిక పరిపాలకుడు పీఠాధిపతి ఆంథోనీ జేమ్స్ కార్కోరన్, S.J. ఎన్నికయ్యారు.
తుది సందేశ కమిటీ, ఆసియా శ్రీసభలకు ఉద్దేశించిన సమావేశ ముగింపు సందేశాన్ని రూపొందించే బాధ్యతను చేపట్టనుంది. ఈ కమిటీలో హాంకాంగ్ పీఠాధిపతి కార్డినల్ స్టీఫెన్ చౌ సౌ-యాన్, SJ, భారతదేశంలోని హైదరాబాద్ అగ్రపీఠాధిపతి కార్డినల్ ఆంథోనీ పూలా, మలేషియాలోని కౌలాలంపూర్ అగ్రపీఠాధిపతి జూలియన్ లియో బెంగ్ కిమ్, ఫిలిప్పీన్స్లోని లిపా అగ్రపీఠాధిపతి గిల్బర్ట్ ఎ. గార్సెరా సభ్యులుగా ఎన్నికయ్యారు.
ప్రతినిధులు ఫిలిప్పీన్స్లోని లింగాయెన్-డగుపాన్ అగ్రపీఠాధిపతి సోక్రటీస్ బి. విల్లెగాస్, బంగ్లాదేశ్లోని ఢాకా అగ్రపీఠాధిపతి బెజోయ్ ఎన్. డి'క్రూజ్, OMI, అలాగే ఇండోనేషియాలోని బాండుంగ్ పీఠాధిపతి ఆంటోనియస్ సుబియాంటో బుంజామిన్, OSCలను సమావేశ అధ్యక్ష మండలి సభ్యులుగా (Presiding Officers) ఎన్నుకున్నారు. వీరు FABC అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శితో కలిసి సమావేశ దైనందిన కార్యక్రమాలను పర్యవేక్షించే స్టీరింగ్ కమిటీగా వ్యవహరిస్తారు.
ఈ ఎన్నికలతో "ఆసియాలో సినడల్ పరివర్తన మరియు వారధుల నిర్మాణ సేవ" అనే ఇతివృత్తంపై సమావేశ ప్రధాన కార్యాచరణకు శ్రీకారం చుట్టబడింది. అదే సమయంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ ప్రవేశపెట్టడం ద్వారా, భాగస్వామ్యం, పారదర్శకత, ఉమ్మడి వివేచన అనే సినడల్ స్ఫూర్తిని కాపాడుకుంటూనే, నూతన సాంకేతిక సాధనాలను స్వీకరించేందుకు FABC చూపుతున్న సుముఖత స్పష్టమైంది.