దేవుని అనుగ్రహానికి హృదయాలను తెరిచి ఉంచండి: అగ్రపీఠాధిపతి మార్కో టిన్ విన్

అగ్రపీఠాధిపతి మార్కో టిన్ విన్
2026 జూలై 23న జరిగిన FABC 12వ ప్లీనరీ సమావేశంలో అగ్రపీఠాధిపతి మార్కో టిన్ విన్ పవిత్ర దివ్యబలికి అధ్యక్షత వహిస్తూ, సువార్తకు విశ్వసనీయ సాక్షిగా శ్రీసభ నిలవాలంటే దేవుని అనుగ్రహానికి తెరిచి ఉండే హృదయాలను పెంపొందించుకోవాలని శ్రీసభ నాయకులకు పిలుపునిచ్చారు.

Federation of Asian Bishops' Conferences (FABC) 12వ ప్లీనరీ సమావేశానికి హాజరైన శ్రీసభ నాయకులు తమ హృదయాలను దేవుని అనుగ్రహానికి తెరిచి ఉంచాలని, అలాంటి మనోభావమే శ్రీసభను సువార్తకు విశ్వసనీయ సాక్షిగా, ఆసియాలో వారధులను నిర్మించే సమాజంగా తీర్చిదిద్దుతుందని మయన్మార్‌కు చెందిన అగ్రపీఠాధిపతి మార్కో టిన్ విన్ పిలుపునిచ్చారు.

జూలై 23న జకార్తాలోని హోటల్ ములియాలో జరిగిన FABC ప్లీనరీ సమావేశం నాలుగో రోజు ప్రారంభ పవిత్ర దివ్యబలి సందర్భంగా ఆయన ఈ సందేశాన్ని అందించారు.

ఈ పవిత్ర దివ్యబలికి అగ్రపీఠాధిపతి మార్కో టిన్ విన్ ప్రధాన అర్చకునిగా వ్యవహరించగా, పాకిస్థాన్‌కు చెందిన అగ్రపీఠాధిపతి ఖాలిద్ రెహ్మత్, తైవాన్‌కు చెందిన పీఠాధిపతి జాన్ బాప్టిస్ట్ లీ కెహ్-మియెన్ సహఅర్చకులుగా పాల్గొన్నారు. వీరితో పాటు సమావేశంలో పాల్గొంటున్న కార్డినల్స్, పీఠాధిపతులు, గురువులు కూడా దివ్యబలిలో పాల్గొన్నారు.

మత్తయి సువార్త 13వ అధ్యాయం ఆధారంగా ప్రసంగించిన అగ్రపీఠాధిపతి మార్కో టిన్ విన్, "ప్రజలతో మీరు ఉపమానాల ద్వారా ఎందుకు మాట్లాడుతున్నారు?" అని శిష్యులు యేసును అడిగిన ప్రశ్నను ప్రస్తావిస్తూ తన సందేశాన్ని ప్రారంభించారు. ఉపమానాలు కేవలం బోధనా విధానం మాత్రమే కాకుండా, దేవుని రాజ్య రహస్యాన్ని ప్రజలకు అనుభవింపజేసే మార్గమని ఆయన వివరించారు.

"ఉపమానాలు మానవ హృదయాన్ని తాకుతూ దైవసత్యాన్ని తెలియజేస్తాయి. విశ్లేషణ కంటే ఒక కథ ఎంతో ప్రభావవంతంగా మాట్లాడుతుంది. అది విన్న తర్వాత కూడా చాలా కాలం ప్రజల మనస్సుల్లో నిలిచిపోతుంది," అని ఆయన అన్నారు.

సువార్తలో చెప్పబడిన చూడడం, వినడం అనేవి కేవలం భౌతిక దృష్టి, శ్రవణానికి మాత్రమే సంబంధించినవి కాదని, దేవుని అనుగ్రహాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్న హృదయమే అత్యంత ముఖ్యమని అగ్రపీఠాధిపతి పేర్కొన్నారు.

"చూడడం, వినడం, అర్థం చేసుకోవడం కోసం దేవుని అనుగ్రహానికి అనుగుణంగా స్పందించే హృదయం అవసరం. హృదయం అనుగ్రహానికి తెరుచుకున్నప్పుడు, మనస్సు దేవుని దృష్టితో జీవితాన్ని అర్థం చేసుకునే సామర్థ్యాన్ని పొందుతుంది," అని ఆయన చెప్పారు.

పవిత్రాత్మ ప్రసాదించే గొప్ప వరాలలో జ్ఞానమూ ఒకటని పేర్కొన్న ఆయన, అది కేవలం విషయ పరిజ్ఞానాన్ని మాత్రమే కాకుండా, దైవసత్యాన్ని గ్రహించి, దేవుని వాక్యం మన జీవితాలను పరివర్తన చేయడానికి అవకాశం కల్పిస్తుందని వివరించారు.

యేసు ఉపమానాలను "పవిత్రమైన తెరలు"గా అభివర్ణించిన అగ్రపీఠాధిపతి మార్కో టిన్ విన్, అవి ఒకవైపు దేవుని రహస్యాలను మరుగుపరుస్తూనే, మరోవైపు వాటినే వెల్లడిస్తాయని అన్నారు. వినయంతో సత్యాన్ని వెదికేవారికి అవి దేవుని హృదయాన్ని దర్శించే కిటికీలుగా మారతాయని, తెరలు తొలగిన హృదయం కలిగినవారికి అవి మరింత లోతైన పరివర్తనకు ఆహ్వానమవుతాయని చెప్పారు.

సువార్తలో యేసు ఉటంకించిన ప్రవక్త యెషయా మాటలను ప్రస్తావిస్తూ, మానవ హృదయాలు ఆధ్యాత్మికంగా స్పందించని స్థితికి చేరుకోవచ్చని ఆయన అన్నారు. అయినప్పటికీ, క్రీస్తు దేవుని వాక్యమనే విత్తనాన్ని చల్లడాన్ని ఎన్నడూ ఆపడని విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

"యేసు ఎవరినీ ఖండించడం లేదు; ఆయన బాధపడుతున్నారు. అయినప్పటికీ ఆయన ఎప్పుడూ నిరాశ చెందరు. నేల ఎంత గట్టిగా ఉన్నా, ప్రతి హృదయంలో తన వాక్యమనే విత్తనాన్ని చల్లుతూనే ఉంటారు," అని ఆయన అన్నారు.

ఆయన ప్రసంగం, సినడల్ పరివర్తనను, ఆసియా అంతటా వారధులను నిర్మించే శ్రీసభ సేవను ప్రతిబింబిస్తున్న FABC ప్లీనరీ సమావేశ ప్రధానాంశంతో అనుసంధానమైంది. అలాంటి సేవా కార్యక్రమం వ్యూహాలతో గానీ, నిర్మాణాలతో గానీ ప్రారంభం కాదని, దేవుని అనుగ్రహంతో పరివర్తన చెందిన, ఆయన వాక్యాన్ని ఆలకించే హృదయాలతోనే ప్రారంభమవుతుందని అగ్రపీఠాధిపతి వివరించారు.

ఈ ఆధ్యాత్మిక సందేశం అనంతరం జరిగిన ప్లీనరీ సమావేశాల్లో, ప్రాగ్‌లోని చార్ల్స్ విశ్వవిద్యాలయంలో సామాజిక శాస్త్ర ప్రొఫెసర్ మోన్సిగ్నోర్ టోమాస్ హాలిక్ ప్రపంచ భౌగోళిక-రాజకీయ పరిణామాలపై ప్రసంగించగా, మలయా విశ్వవిద్యాలయం ఆగ్నేయాసియా అధ్యయన విభాగం అధ్యాపకురాలు డాక్టర్ చోంగ్ పుయ్ యీ, ఆసియాలో మారుతున్న వాస్తవికతలు, అలాగే సంభాషణ, సమన్వయం, ఐక్యతకు అంకితమైన సువార్త ప్రచార సినడల్ సమాజంగా శ్రీసభ ఎదగాల్సిన పిలుపుపై తన ప్రసంగాన్ని అందించారు.