జకార్తాకు చేరుకున్న FABC ప్రతినిధులు – తుది ఏర్పాట్లు పూర్తి చేసిన స్వచ్ఛంద సేవకులు
Federation of Asian Bishops' Conferences (FABC) 12వ ప్లీనరీ సమావేశం కోసం ఆసియా నలుమూలల నుంచి కార్డినల్స్, పీఠాధిపతులు, గురువులు, కన్యస్త్రీలు, సామాన్య విశ్వాసుల ప్రతినిధులు జూలై 20న ఇండోనేషియాలోని జకార్తాకు చేరుకున్నారు.
వారంరోజుల పాటు కొనసాగే ఈ సమావేశం కోసం వందలాది మంది స్వచ్ఛంద సేవకులు విమానాశ్రయ స్వాగతం, రవాణా, నమోదు, వసతి ఏర్పాట్లను సమన్వయం చేశారు.
ఉదయం నుంచే జకార్తాలోని సోకార్నో-హట్టా అంతర్జాతీయ విమానాశ్రయంలో స్వచ్ఛంద సేవకుల బృందాలు విధుల్లోకి దిగాయి. తూర్పు ఆసియా, దక్షిణాసియా, ఆగ్నేయాసియా తదితర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతినిధులను ఆహ్వానించేందుకు వారు సిద్ధంగా నిలిచారు. విమానాల సమయ పట్టికలు, గుర్తింపు కార్డులు, సమాచార పరికరాలతో కూడిన ఈ బృందాలు విమానాల రాకపోకలను పర్యవేక్షిస్తూ, ప్రతినిధులను ఆహ్వానించి, సమావేశ వేదికతో పాటు అధికారిక వసతి కేంద్రంగా ఏర్పాటు చేసిన మూలియా హోటల్ జకార్తాకు వారి రవాణాను సమన్వయం చేశాయి.
విమానాశ్రయంలో స్వాగత ఏర్పాట్లు కొనసాగుతుండగా, హోటల్లోని మరో బృందం నమోదు కేంద్రాన్ని సిద్ధం చేసింది. అక్కడ ప్రతినిధులకు గుర్తింపు కార్డులు, సమావేశానికి సంబంధించిన పత్రాలు, కార్యక్రమ వివరాలు అందజేశారు. మరికొందరు స్వచ్ఛంద సేవకులు హోటల్లో గది కేటాయింపులు, సామానుల నిర్వహణ, ప్రయాణానంతర అవసరాల్లో ప్రతినిధులకు సహకరించారు.
స్వాగతం, వసతి ఏర్పాట్లతో మాత్రమే కాకుండా, ఇతర అన్ని విభాగాల్లోనూ తుది సన్నాహాలు పూర్తయ్యాయి. ప్రత్యక్ష ప్రసారాల కోసం మీడియా బృందాలు సాంకేతిక పరీక్షలు నిర్వహించగా, దివ్యబలి ఏర్పాట్లను లిటర్జీ కమిటీ ఖరారు చేసింది. సమాచార, వైద్య, అతిథి సత్కారం, సాంకేతిక విభాగాలు కూడా సమావేశ ప్రారంభానికి ముందు తమ తుది కార్యాచరణ పరీక్షలను పూర్తి చేశాయి.
స్థానిక నిర్వహణ కమిటీ కార్యదర్శి గురుశ్రీ ఫ్రాన్స్ క్రిస్టి ఆది ప్రసేత్యా మాట్లాడుతూ, ప్రతినిధుల రాక అనేది కేవలం సమావేశానికి సంబంధించిన నిర్వహణ ప్రక్రియ మాత్రమే కాదని అన్నారు.
"ఆసియాలోని శ్రీసభ ఎదుర్కొంటున్న సవాళ్లపై సమావేశ మందిరంలో కలిసి ఆలోచించడానికి ముందుగా, వారు సహోదరులుగా ఆహ్వానించబడుతున్నారనే అనుభూతిని పొందాలని మేము కోరుకుంటున్నాము," అని ఆయన తెలిపారు.
ఈ స్వాగతం, సమావేశానికి పునాదిగా నిలిచిన సినడల్ స్ఫూర్తికి ప్రతిబింబమని ఆయన వివరించారు.
"ప్రతి స్వాగత ఏర్పాటూ కేవలం సౌకర్యం కల్పించడానికే కాదు; కలిసి నడిచే సినడల్ శ్రీసభ స్ఫూర్తిని వ్యక్తపరచడానికే రూపొందించబడింది," అని ఆయన అన్నారు.
ఈ ఏర్పాట్లన్నింటికీ నెలల తరబడి జరిగిన ప్రణాళికాబద్ధమైన సమన్వయం కారణమని ఆయన తెలిపారు. శ్రీసభ స్వచ్ఛంద సేవకులు, విమానాశ్రయ అధికారులు, ఇమ్మిగ్రేషన్ సిబ్బంది, రవాణా సంస్థలు, హోటల్ సిబ్బంది, ప్రభుత్వ శాఖలు కలిసి ఈ ఏర్పాట్లను విజయవంతం చేశాయి. విమాన సమయాల్లో మార్పులు, అదనపు నమోదులు, రవాణా మార్పులు వంటి అంశాలను రోజంతా నిరంతరం సమన్వయం చేశారు.
ఈ సమిష్టి కృషి కూడా సమావేశ ప్రధాన అంశమైన సినడాలిటీకి ప్రత్యక్ష సాక్ష్యమని గురుశ్రీ ఫ్రాన్స్ పేర్కొన్నారు.
"FABC ప్లీనరీ సమావేశం విజయానికి ఒక్క బృందం చేసిన కృషి కారణం కాదు. దేవుని ప్రజలందరి సహకారమే దీనికి పునాది. సామాన్య విశ్వాసులు, కన్యస్త్రీలు, గురువులు, పీఠాధిపతులు, స్వచ్ఛంద సేవకులు, ప్రభుత్వ భాగస్వాములు—ప్రతి ఒక్కరూ తమ తమ బాధ్యతలను నిర్వర్తిస్తూ, ఆసియాలోని శ్రీసభ సేవకు అంకితభావంతో కలిసి పనిచేశారు," అని ఆయన చెప్పారు.
ఈ సేవలో పాల్గొన్న వారిలో ప్రతినిధులకు సమావేశం మొత్తం పాటు సహకరించే లైజన్ అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న హిలరీ అరిస్టోటెల్ కూడా ఒకరు.
"ఇంత ప్రాముఖ్యమైన సమావేశంలో లైజన్ అధికారిగా ఎంపిక కావడం, ఈ సేవలో భాగస్వామి కావడం నాకు గొప్ప గౌరవంగా భావిస్తున్నాను," అని ఆమె అన్నారు.
దాదాపు 150 మంది ప్రతినిధుల అవసరాలను ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తూ, భద్రత, రవాణా, వసతి, సమాచార, వైద్య, అతిథి సత్కార బృందాలతో నిరంతరం కలిసి పనిచేయాల్సి ఉంటుందని ఆమె వివరించారు.
ప్రతి కమిటీ ఒకే లక్ష్యంతో కలిసి పనిచేసిన ఈ అనుభవం, ప్రతి బాధ్యత సమావేశ విజయానికి ఎంత ముఖ్యమో తనకు స్పష్టంగా తెలియజేసిందని హిలరీ చెప్పారు.
సాయంత్రానికి ఎక్కువమంది ప్రతినిధులు మూలియా హోటల్ జకార్తాకు చేరుకుని తమ వసతి గదుల్లో స్థిరపడ్డారు. అదే సమయంలో నిర్వహణ బృందాలు మరుసటి రోజు రానున్న ప్రతినిధుల వివరాలను సమీక్షిస్తూ, ప్రారంభ సమావేశాల కోసం తుది ఏర్పాట్లను కొనసాగించాయి.
ఇండోనేషియా కతోలిక శ్రీసభ ఆతిథ్యం ఇస్తున్న FABC 12వ ప్లీనరీ సమావేశం, సినడల్ పరివర్తనతో పాటు ఆసియా అంతటా వారధులు మరియు వారధుల నిర్మాణకర్తలుగా ఉండే శ్రీసభ సేవ అనే అంశంపై, ఆసియా నలుమూలల నుంచి వచ్చిన శ్రీసభ నాయకులను ఒక వారం పాటు ప్రార్థన, సంభాషణ, వివేచన కోసం ఏకతాటిపైకి తీసుకువస్తోంది.