'ఇకపై మన ప్రయాణం ఎటు?' – FABC అసోసియేట్ కార్యదర్శి ప్లీనరీ సమావేశం భవిష్యత్ దిశపై ఆత్మపరిశీలన

గురుశ్రీ క్లారెన్స్ దేవదాస్
గురుశ్రీ క్లారెన్స్ దేవదాస్: "జకార్తా నుంచి బయలుదేరే ప్రతి ప్రతినిధి, శ్రీసభగా జీవించే సినడల్ విధానాన్ని పునరంకిత భావంతో ఆచరించాలనే నూతన నిబద్ధతతో తిరిగి వెళ్లాలని మా ప్రగాఢ ఆకాంక్ష."

Federation of Asian Bishops' Conferences (FABC) 12వ ప్లీనరీ సమావేశం ముగింపు సందర్భంగా, FABC అసోసియేట్ కార్యదర్శి, Office of Synodality కార్యనిర్వాహక కార్యదర్శి గురుశ్రీ క్లారెన్స్ దేవదాస్ ప్లీనరీ సమావేశం చివరి రోజుల చర్చలకు దిశానిర్దేశం చేసిన ప్రశ్నను ముందుంచారు: "ఇకపై మన ప్రయాణం ఎటు?"

జూలై 26న ఇండోనేషియాలోని జకార్తాలో మరియ మాత స్వర్గారోహణ బృహద్దేవాలయం సేవా కేంద్రంలో జరిగిన ప్లీనరీ సమావేశం ముగింపు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, వారం రోజులపాటు జరిగిన ఈ సమావేశం ప్రేరణ, ఆధ్యాత్మిక వివేచన దశలను దాటి, ఆసియాలోని స్థానిక శ్రీసభలు సినడల్ పరివర్తన ప్రయాణాన్ని కొనసాగించేందుకు ఆచరణాత్మక మార్గాలను గుర్తించే దశకు చేరుకుందని గురుశ్రీ దేవదాస్ తెలిపారు.

ప్రతినిధులు జకార్తాలోని ఫ్రెండ్షిప్ టన్నెల్ గుండా సమీపంలోని ఇస్తిక్లాల్ మసీదు వరకు ప్రతీకాత్మక తీర్థయాత్ర పూర్తి చేసిన అనంతరం ఈ విలేకరుల సమావేశం జరిగింది. సంభాషణ, వారధుల నిర్మాణం పట్ల ప్లీనరీ సమావేశ నిబద్ధతను ఈ తీర్థయాత్ర ప్రతిబింబించింది. ఈ సమావేశంలో FABC ఉపాధ్యక్షుడు కార్డినల్ పాబ్లో వర్జిలియో డేవిడ్, ఇండోనేషియా కతోలిక పీఠాధిపతుల సమాఖ్య అధ్యక్షుడు పీఠాధిపతి ఆంటోనియస్ సుబియాంటో బుంజామిన్ కూడా పాల్గొన్నారు.

"మన గత విలేకరుల సమావేశం తర్వాత, ప్లీనరీ సమావేశం ప్రేరణ దశ నుంచి వివేచన, భవిష్యత్ దిశను నిర్ధారించే దశకు చేరుకుంది. ఇప్పుడు ప్రతినిధులు తమ స్థానిక శ్రీసభలకు తిరిగి వెళ్లేందుకు సిద్ధమవుతున్న ఈ సమయంలో, ఈ ప్లీనరీ సమావేశం తర్వాత కూడా సినడల్ పరివర్తన ప్రయాణాన్ని కొనసాగించేందుకు అవసరమైన ఆచరణాత్మక మార్గాలను వారు వివేచించారు," అని గురుశ్రీ దేవదాస్ అన్నారు.

ఈ సమావేశం యొక్క ప్రధాన నిరీక్షణ ఏమిటంటే, ప్రతి ప్రతినిధి శ్రీసభ దైనందిన జీవితంలో సినడాలిటీని ఆచరించాలనే నూతన నిబద్ధతతో స్వస్థలాలకు తిరిగి వెళ్లడమేనని ఆయన చెప్పారు.

"జకార్తా నుంచి బయలుదేరే ప్రతి ప్రతినిధి, శ్రీసభగా జీవించే సినడల్ విధానాన్ని పునరంకిత భావంతో ఆచరించాలనే సంకల్పంతో వెళ్లాలని మా ప్రగాఢ ఆకాంక్ష," అని ఆయన అన్నారు.

గురుశ్రీ దేవదాస్ ప్రకారం, వారం రోజులపాటు జరిగిన అధికారిక సమావేశాలు, Conversations in the Spirit, ప్రాంతీయ సమావేశాలు, అనౌపచారిక సంభాషణలు ఆసియాలోని భిన్న సంస్కృతులు, భాషలు, సేవాపర వాస్తవికతల మధ్య కూడా పీఠాధిపతుల సంఘబంధాన్ని బలోపేతం చేశాయి. అలాగే కలిసి నడవాలనే వారి నిబద్ధతను మరింత గాఢం చేశాయి.

ఈ చర్చలన్నింటి కేంద్రబిందువులో ఒకే విశ్వాసం ఉందని ఆయన చెప్పారు. అదేంటంటే, నిజమైన పునరుద్ధరణ కొత్త నిర్మాణాలతో కాకుండా, వ్యక్తిగత పరివర్తనతో ప్రారంభమవుతుంది.

గురుశ్రీ క్లారెన్స్ దేవదాస్
గురుశ్రీ క్లారెన్స్ దేవదాస్: "నిజమైన సువార్త ప్రచార సినడల్ శ్రీసభగా మారాలంటే మొదటి అడుగు హృదయ పరివర్తనే."

"నిజమైన సువార్త ప్రచార సినడల్ శ్రీసభగా మారాలంటే మొదటి అడుగు హృదయ పరివర్తనే. వ్యక్తిగత, సేవాపర పరివర్తన లేకుండా నిర్మాణాత్మక పునరుద్ధరణ సాధ్యం కాదు," అని ఆయన అన్నారు.

సినడాలిటీ అంటే ప్రధానంగా వ్యవస్థలను మార్చడం లేదా కొత్త కార్యక్రమాలు రూపొందించడం కాదని, పరిశుద్ధాత్మ దేవుడు దేవునితో, పరస్పరం, అలాగే శ్రీసభ సేవ చేయాల్సిన ప్రజలతో మన సంబంధాలను రూపాంతరం చెందేలా అనుమతించడమేనని ఆయన వివరించారు.

ప్లీనరీ సమావేశ చర్చలను ప్రస్తావిస్తూ, ఆసియాలోని అనేక స్థానిక శ్రీసభలు సంప్రదింపులు, చైతన్యవంతమైన Basic Ecclesial Communities, సామాన్య విశ్వాసుల చురుకైన భాగస్వామ్యం, మతాంతర సంభాషణ ద్వారా ఇప్పటికే సినడాలిటీకి చెందిన అనేక అంశాలను చాలాకాలంగా ఆచరిస్తున్నాయని గురుశ్రీ దేవదాస్ పేర్కొన్నారు.

ప్రతినిధులు సమాజం, శ్రీసభ రెండూ ఎదుర్కొంటున్న సవాళ్లను కూడా పరిశీలించారని ఆయన చెప్పారు. వాటిలో ధ్రువీకరణ, వలసలు, పర్యావరణ క్షీణత, వేగవంతమైన సాంకేతిక మార్పులు, ప్రజాస్వామ్య స్థలాల సంకుచితం కావడం, సామాజిక, ఆర్థిక అసమానతల పెరుగుదల ప్రధానమైనవని పేర్కొన్నారు.

అయితే ఈ సవాళ్లను అడ్డంకులుగా కాకుండా, సంభాషణ, విద్య, ఆతిథ్యం, సృష్టి సంరక్షణ, మానవ గౌరవం పట్ల మరింత నిబద్ధత ద్వారా సువార్తకు నూతన సాక్ష్యాన్ని అందించే అవకాశాలుగా పీఠాధిపతులు చూశారని ఆయన తెలిపారు.

శ్రీసభ అంతర్గతంగా, క్లరికలిజం ఇప్పటికీ సంఘబంధానికి, ఉమ్మడి బాధ్యతకు అడ్డంకిగా ఉందని ఆయన అంగీకరించారు. సేవాభావ నాయకత్వం, ఉమ్మడి వివేచన, పునరుద్ధరించిన శ్రీసభ నిర్మాణాలు, అలాగే శ్రీసభ జీవితం, సేవలో సామాన్య విశ్వాసుల భాగస్వామ్యాన్ని మరింత విస్తరించాలని ఆయన పిలుపునిచ్చారు.

ప్లీనరీ సమావేశాన్ని దాటి భవిష్యత్ కార్యాచరణను ప్రస్తావిస్తూ, సినడాలిటీని ఆచరణలో అమలు చేయడానికి స్థానిక శ్రీసభలకు మార్గనిర్దేశం చేసే సినడాలిటీ ఆచరణాత్మక మార్గదర్శకం (Vademecum)ను FABC Office of Synodality సిద్ధం చేస్తోందని గురుశ్రీ దేవదాస్ ప్రకటించారు.

"ఈ ప్లీనరీ సమావేశాన్ని ముగించుకుని జకార్తా నుంచి మనం ప్రోత్సాహంతో, ఐక్యతతో, నూతన స్ఫూర్తితో బయలుదేరుతున్నాం. ఇక్కడ ప్రారంభమైన సంభాషణలు మన స్థానిక శ్రీసభల్లో, మన ప్రాంతాల్లో, ఆసియా అంతటా కొనసాగుతాయి," అని ఆయన అన్నారు.

చివరిగా, వారం రోజులపాటు ప్లీనరీ సమావేశాన్ని సమగ్రంగా కవర్ చేసిన విలేకరులకు గురుశ్రీ దేవదాస్ కృతజ్ఞతలు తెలిపారు. వారి వార్తా కథనాల ద్వారా ఆసియా అంతటా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కతోలికులు వినడం, వివేచించడం, కలిసి నడవడం అనే శ్రీసభ నిరీక్షణలు, సేవలో భాగస్వాములయ్యారని ఆయన అన్నారు.

Telugu Survey Popup Image